Friday, December 18, 2015

దొందూ దొందే...

ఛీ..ఛీ..ఛీ.. 

1. అంబేద్కర్ పై చర్చ తర్వాత కాల్ మనీపై చర్చలో పాల్గొంటే ప్రతిపక్షానికి పోయేదేం లేదు.

2. కాల్ మనీపై ముందు చర్చించి ఆ తర్వాత అంబేద్కర్ పై చర్చిస్తే అధికారపక్షానికి వచ్చే నష్టమేం లేదు.

- ఏ ఒక్క పార్టీకి ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు. అన్ని పార్టీలూ ఆ తానుముక్కలే.
చాలా ఛండాలంగా ఉంది అసెంబ్లీ జరుగుతున్న తీరు.

- వీళ్లకు ఓటేసి గెలిపించి అసెంబ్లీకి పంపినందుకు ప్రజలు సిగ్గుతో తలవంచుకోవాలి.


Wednesday, April 08, 2015

కూలీలపై కాల్పులు తప్పా..?


     చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై కొంతమంది ఆరోపణలు గుప్పిస్తున్నారు. కూలీలను కాల్చి చంపడం నేరమని మాట్లాడుతున్నారు. కూలీలు ఏం తప్పు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా కూలీలను పొట్టన పెట్టుకునిందని విమర్శిస్తున్నారు.. ఇక తమిళనాడులో ఆంధ్ర ప్రజలు, ఆస్తులపై తమిళులు కక్షగట్టారు. ఆంధ్రా బస్సులను ధ్వంసం చేస్తున్నారు..

కూలీలా..? హంతకులా..?
     తమిళుల ఆగ్రహంలో అర్థం ఉండొచ్చు.. కానీ అక్కడ చనిపోయింది తమిళుల ఆత్మాభిమానాలను దశదిశలా వ్యాపింపజేసిన మహాపురుషులు కాదనే విషయాన్ని వాళ్లు గుర్తుపెట్టుకోవాలి. తమిళుల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని మంటగలపిన కూలీలు వాళ్లు. పొట్టకూటికోసం చిప్ప చేతబట్టుకుని శేషాచలం అడవులకు వచ్చిన కూలీలు కాదు వాళ్లు. వాళ్ళంతా డబ్బుపై వ్యామోహంతో ఎలాంటి నీచానికైనా పాల్పడే మనస్తత్వమున్న వ్యక్తులు..

స్మగ్లింగ్ నేరం కాదా..?

     ఎర్రచందనం స్మగ్లింగ్ నేరమనే విషయం అందరికీ తెలిసింది.. ఎర్రచందనాన్ని దొంగచాటుగా కొట్టి తరలిస్తున్న కూలీలకు ఆ విషయం ఇంకా బాగా తెలుసు. అయినా వాళ్లంతా శేషాచలానికి వచ్చారు.. అంటే స్మగ్లింగ్ నేరమని తెలిసీ వచ్చారు.. ఇలాంటి అక్రమాలకు పాల్పడేటప్పుడు ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని కూడా వారికి తెలుసు. అయినా వాళ్లు లెక్కచేయలేదు. పొట్టకూటికోసం పాకులాడే కూలీలెవరూ ఇలాంటి పనులు చేయరు.. శేషాచలం అడవుల్లో హతమైన కూలీలందరూ డబ్బుకోసం ఎలాంటి అఘాయిత్యాలకైనా పాల్పడే హంతకులే..!

     అమాయక కూలీలను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని.. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కొంతమంది పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేరమని తెలిసీ అడవుల్లోకీ ఈ కూలిలంతా ఎందుకొచ్చారు..? కొన్ని నెలల కిందట ఓ అటవీ అధికారిని శేషాచలం అడవుల్లోనే బండరాళ్ళతో మోది పాశవికంగా హత్య చేసినప్పుడు ఈ సోకాల్డ్ మానవ హక్కుల పరిరక్షకులు ఏమయ్యారు..? అప్పుడు అటవీ అధాకారిని మర్డర్ చేసింది కూలీల వేషంలో ఉన్న హంతకులు కాదా..?


ఏది నేరం..? ఏది న్యాయం..?
     ఇక తమిళనాడులో ఆంధ్రా ఎన్ కౌంటర్ పై అనేక విమర్శలు వస్తున్నాయి.. వారు అలా ప్రవర్తించడాన్ని తప్పుబట్టలేం.. అయితే.. తమిళనాడులో పేరొందిన స్మగ్లర్ వీరప్పన్ ఉదంతం ఇక్కడోసారి గుర్తు చేసుకోవాలి. వీరప్పన్ కోసం తమిళనాడు సర్కార్ ఎంత పెద్ద పోరాటం చేసిందో తెలుసు.. వీరప్పన్ కోసం తమిళనాడు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసు. నాడు వాళ్ళ రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్న వీరప్పన్ ను హత్య చేయడంపై తమిళనాడు మొత్తం సంబరాలు చేసుకుంది. ఇప్పుడు అదే తమిళనాడుకు చెందిన కూలీలు పక్కరాష్ట్రం సంపదను దోచుకెళ్లూ చనిపోతే మాత్రం పెద్ద నేరం.. ఇదేం న్యాయం..? సంపద ఏ రాష్ట్రానికైనా సంపదే..! నేరం ఎక్కడైనా నేరమే..!

Sunday, August 17, 2014

ఈ మాటలకు అర్థమేంటి..?

ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి..?



Tuesday, July 22, 2014

మారండి బాబూ....!!

బాబు మారరు..!!


రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 3 జిల్లాలకు చంద్రబాబు వరాలు ప్రకటించారు బాగానే ఉంది. మరి కడప జిల్లాను ఎందుకు అనాధగా వదిలేశారు? ఇది ప్రతిపక్షనేత జగన్ జిల్లా కాబట్టి వదిలేశారా..? కడప జిల్లా వై.ఎస్. కుటుంబానికి కంచుకోట కాబట్టి ఇక్కడేమీ పెట్టకూడదనుకుంటున్నారా..? కడపకు ఏం తక్కువ..? దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను కనెక్ట్ చేసే రైల్వే లైన్ ఉంది. బ్రిటీష్ కాలం నాటి ఏర్ పోర్ట్ ఉంది. అత్యాధునిక హంగులతో ఏర్పడిన యోగి వేమన యూనివర్సిటీ ఉంది. పెన్నా నది ఒడ్డునే కడప నగరం ఉండడంతో తాగునీటికి సమస్య ఉండదు.. తెలుగుదేశం పార్టీ ఫేస్ బుక్ పేజీలోని ఈ ఇమేజ్ చూసిన తర్వాత అర్థమైంది ఒక్కటే.. కడపను వాంటెడ్ గానే నిర్లక్ష్యం చేస్తున్నారని! 

     వై.ఎస్.కు, చంద్రబాబుకు తేడా ఇక్కడే కనపడుతుంది. వై.ఎస్. తాను ఎక్కడ బలహీనంగా ఉన్నారో అక్కడ బలపడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు.. చంద్రబాబు చిత్తూరు జిల్లావాసి అయినా నాడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడానికి కారణం వై.ఎస్. అనుసరించిన ఎత్తుగడలే..! అంతెందుకు.. నేడు జగన్ పార్టీ కూడా చిత్తూరులో సత్తా చాటింది..! కానీ చంద్రబాబు పార్టీ కడపలో తరాలుగా చతికిలపడుతూనే ఉంది.. ఇందుకు కారణం చంద్రబాబు కడపపై పెద్దగా దృష్టి పెట్టకపోవడమే.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపపై ఓ చూపు చూసి ఉంటే.. వై.ఎస్. హవాకు చెక్ పెట్టి ఉండొచ్చు. కానీ చంద్రబాబు ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. 

     కడప అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే.. కనీసం ఇప్పుడైనా తాను మారానని చెప్పుకుంటున్న చంద్రబాబు కడపపై కాస్త దృష్టి పెడతారని ఆశించాను. కడపలో పాగా వేసేందుకు జిల్లాపై వరాల వర్షం కురిపిస్తారని ఆశించాను. వై.ఎస్. కంటే చంద్రబాబే నయం.. జిల్లాకు మేలు చేశారు అని.. ప్రజలు కొనియాడేలా పేరు తెచ్చుకుంటారని భావించాను.. ఒక్క తిరుపతికే అన్ని విద్యాసంస్థలు కేటాయించకపోతే అందులో ఒకదాన్ని కడపలో పెడితే బాగుంటుంది కదా..? కోస్తా జిల్లాలన్నిటినీ కారిడార్ పేరుతో కలిపేస్తున్నారు. సీమలోని నాలుగింటిలో మూడు చోట్ల విద్యాసంస్థలు కేటాయించారు.. అంటే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఒక్క కడప జిల్లాయే అనాథ! 

     ఇది దారుణం.. అన్యాయం.. గర్హనీయం.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..! ఈ పోస్టు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే... ఆయన మారలేదు.. ఆయన మారనంత వరకూ కడప జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల మనసు మార్చుకోరు..! ఇది వాస్తవం..!! కాస్త మేల్కోండి చంద్రబాబు గారూ..! ఎక్కడ వీక్ గా ఉన్నారో.. అక్కడ స్ట్రాంగ్ అయ్యేందుకు ట్రై చేయండి..!!